నా లోని అసురుడు


ప్రతీ మనిషిలోనూ ఎంత మంచితనమున్నా, అంతో ఇంతో రాక్షస గుణాలు కూడా ఉంటాయి.  ఇవి  కొంతమంది లో నిఘూఢమై ఉండవచ్చు. కొంతమందిలో  సమయ సందర్భాలని బట్టి బయట పడతాయి.  మరి  కొంత మందిలో మంచితనం ముసుగు వేసుకున్న  రాక్షసత్వం ఉండవచ్చు.  ఇంకొంత మంది బాహాటంగానే తమ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తారు.
 
 అసలు  ఈ దేశం లో వేలిమీద లెఖ్ఖ పెట్టాల్సిన మేధావులలో నేను ఉన్నానని మీకు తెలుసా. తెలియకపోవడం మీ దౌర్భాగ్యం.  నేను చాలా తెలివైనవాడిని. బుద్ధిమంతుడిని. నా అంతటి వాడు లేడని మీకు తెలిసినా మీరు వెంటనే ఒప్పుకోకపోవడం  ఈ దేశం లోని సంకుచిత మనస్థత్వాలకి నిదర్శనం మరియూ తార్కాణం అని ఉటంకిస్తున్నాను.

ఇప్పటికైనా అర్ధం అయిందా నేను మైక్ పట్టుకుంటే మైకాసురుడుని & బాకాసురుడిని. రెండికి తేడా ఏమిటంటారా . మైక్ దొరకగానే ప్రేమగా పట్టుకొని రెండు ముక్కలు చెపుతాను అని ఒక్కొక్క ముక్క కి కనీసం ఒక్కో గంట తీసుకునేవాడిని మైకాసురుడు  అందురు. అందులో కూడా ఒకవాక్యానికి రెండో వాక్యానికి లింకు లేకుండా మాట్లాడగలిగేవాడు మహామైకాసురుడు అనబడును. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా రాజకీయాల్లో ఉంటారు.  తనగురించి తన వాళ్ళగురించి మాత్రమే మాట్లాడగలిగేవాడు బాకాసురుడు. సబ్జెక్ట్ ఏమైనా బహు నిపుణతతో తనమీదకి తిప్పుకొని తనగురించి మాత్రమే బాకా ఊద గలిగేవాడు బాకాసురుడు. 
  
మైక్ అంటే నాకు ఇంత ఇష్టం ఎల్లా పుట్టిందో నాకు తెలియదు. అసలు చిన్నప్పడినించి నాకు మాట్లాడడమంటే ఇష్టం. కిట్టని వాళ్ళు లొడ లొడ వాగుతుంటాడు అని అనేవారు. కానీ పుట్ట గానే పరిమళించాలని  పూవు కి తెలియదా? అదేదో పెద్దగా కొటేషన్ పెట్టి పరిమళించును అంటే కానీ పరిమళించదా.
  
చిన్నప్పుడినించి కూడా నేను స్కూలు చర్చల్లో పాల్గొనేవాడిని. కత్తి గొప్పదా కలం గొప్పదా దగ్గరనించి,   స్త్రీ కి స్వాతంత్ర్యం కావాలా వద్దా దాకా,  మాట్లాడేసేవాడిని. దురదృష్టవశాత్తూ  ఆకాలంలో మైక్ లు ఉండేవి కావు. గొంతు చించుకొని అరవడమే తప్ప. అదేమిటో ఎంత చించుకున్నా ఒక్కమాటూ  బహుమతి రాలేదు. ఆ కోపం,  కసి నాలో పేరుకుపోయాయి. కొద్దిరోజులయిన తరువాత నన్ను అసలు మాట్లాడనిచ్చేవారు కాదు.  పెద్దవుతున్న కొద్ది  ఎప్పుడైనా అవకాశం దొరికితే నా ఉపన్యాసాల తో జనాలని హింస పెట్టడం అలవాటు చేసుకున్నాను.

ఉపన్యాసాల మీద ఎంత ఎక్కువ ఇష్టం ఉన్నా మొదటి  మాటు పెద్ద సభలో  మైక్ పట్టుకున్నప్పుడు  కాళ్ళు, చేతులు,  గొంతు అన్నీ వణికాయి.  ఆ సందర్భం అల్లాంటిది. మొదటి మాటు ఒక సెమినారులో ఒక పరిశోధనా పత్రం  ప్రెజెంటు చేస్తున్నప్పుడు. అది కూడా మా  ఇన్స్టిట్యూట్ లోనే. అప్పటికే మనకి వీరేశం అని పేరు. అంటే  వీర ఆవేశం కలవాడు అని అర్ధం అన్నమాట. వాదనలు వస్తే మనం మడమ తిప్పని వీరులం. సాధారణం గా సెమినారు అంటే  మూడు నాల్గు హాల్స్ లో సెషన్స్ జరుగుతాయి. ఒక్కో హాలు లో ఒక 20-25 దాకా ఉంటారు. నేను వాగవలిసిన హాలులో మా dept. వాళ్ళు అందరూ  కూడా చేరారు, అవకాశం వస్తే  ప్రశ్నోత్తరాల సమయం లో వీడిని ఇరుకులో పెట్టవచ్చు అని వచ్చిన వాళ్ళు కూడా అందులో ఉన్నారు. నేను ఎక్కడ నోరు జారుతానోనని మా బాసు గారు వేంచేసి ఎదురుగా మొదటి వరుసలో  కూర్చున్నారు.   

షెడ్యూల్  ప్రకారం 11-30 కి నేను ఉపన్యసించాలి.  ముందు వాళ్ళు పీకి, సాగదీసి నందు వల్ల నేను స్టేజి ఎక్కేటప్పటికి 12-30 దాటి ఒక ఇరవై  నిముషాలు అయింది. నేను మైకు పట్టుకొని ప్రేమగా నిమిరి, ఎఫ్ఫెక్ట్ కోసం మైక్ మీద వేలితో మీటి,  ఒన్, టు, త్రీ  అని పని చేస్తోందా  హి హి హి అని కూడా అడిగి మరీ మొదలు పెట్టేను. “ఫ్రెండ్స్  నా పేపర్ titled   ‘Evaluation of flow improvers  on some Indian crude oils’.    As you know,  majority of the Indian crudes are high waxy and pose considerable problems in transportation particularly during winter.  ఇక్కడి దాకా బాగానే గత వారం రోజులుగా ప్రాక్టీసు చేసినట్టే చెప్పేశాను. హాలు లోకి జనం రావడం మొదలు పెట్టేరు. నేను రెండు మూడు వాక్యాలు చెప్పే టప్ప టికి జనం మరీ ఎక్కువగా రావడం మొదలు పెట్టేరు,  అందులోనూ హేమా హేమీలు,  పెట్రోలియం రిసర్చ్ లో కురు వృద్దులు అనబడే వారు కూడా విచ్చేశారు. నాకు కంగారు మొదలైంది. మాటలు కొంచెం తడబడడం మొదలైంది. అయినా ధైర్యం గానే ఒక మూడు నిముషాలు ఉపన్యసించాను.  ఇంతలోనే హాలు నిండి పోయింది. జనం నుంచుని మరీ  వినేస్తున్నారు. ఎదురుగుండా  మా బాసు పక్కాయనతో  చేతులు తిప్పుతూ మాట్లాడే స్తున్నాడు.  నేను  గుండె చిక్క బట్టుకొని  crude oil rheology కి వచ్చాను. 

సాధారణంగా ఉపన్యాసం అయ్యేదాకా ప్రశ్నలు వెయ్యరు.  కానీ ఒక కురు వృద్ధుడు లేచి “How does conditioning compare with flow improver treatment and are all oils amenable to conditioning ?”  నా కంగారు పరాకాష్ట కి చేరుకుంది. నన్ను పీకి పాకం పెట్టటానికి వచ్చినట్టున్నారు అనిపించింది ఆ క్షణం లో. చేతులు కాళ్ళు తోటి  తనవు కూడా వణకింగ్ అన్న మాట. కురుసైన్యాన్ని చూసిన ఉత్తర కుమారుడి లాగా. మాటలు తడబడడమే కాక పొంతన లేని వాక్యాలు కూడా ఒకటి రెండు వచ్చేశాయి. అస్త్ర సన్యాసం చేసిన ద్రోణాచార్యుడి పరిస్థితి . ఇంతలో మా బాసు గారు లేచి సమాధానం చెప్పి కూర్చున్నారు. మళ్ళీ నేను బెబ్బే దేదే అంటూ మొదలు పెట్టేను. ఆశ్చర్యం గా జనం వెళ్ళడం మొదలు పెట్టేరు. చూస్తుండగానే ఖాళీ అయిపోయింది హాలు. నేను, సెషన్ ఛైర్మన్ , మా వాళ్ళు ఇంకో 10 మంది, నా తరవాత చదవాల్సిన వారు ఇద్దరు,  మిగిలాం.  మాబాసు గారు కూడా కురువృద్ధుడితో వెళ్ళిపోయారు. పక్కకి చూస్తే అందరూ భోజనాల దగ్గర ఉన్నారు. అప్పుడు అర్ధం అయింది. 12-45  to 1-30  లంచ్ టైమ్. మా హాలు డిన్నర్ హాలు పక్కన ఉంది. అక్కడ రెడీ కాకపోవడం వల్ల అందరూ నన్ను వినిపెడదామని ఇటు వచ్చారు. అక్కడ గంట కొట్టగానే పోలో మని అక్కడికి వెళ్ళిపోయారు. అదన్న మాట సంగతి. వాళ్ళ భోజనం ఆదుర్దా నాకు ఇంత కష్టం తెచ్చిపెట్టింది. 

ఆ తరువాత నేను రాటు తేలాను.  నో ఫియర్ మై డియర్ వీరేశం అనుకుంటూ విజృంభించేశాను. అదే టైమ్ లో నేను మా స్టాఫ్ క్లబ్బు సెక్రెటరీ గా పనిచేశాను. ఏ సభలోనైనా సెక్రెటరీ రిపోర్ట్ అని పెట్టేవాడిని. అందులో నేను ఎల్లా క్షణం తీరికలేకుండా కష్టపడ్డానో , ఎంతమంది దుర్మార్గులు ఎన్ని ఆటంకాలు సృష్టించారో, అవన్నీ నేను ఎంత చతురతో అధిగమించానో, మరొకడైతే అసలేమీ చెయ్యలేకపోయే వాడని ఒక గంట ఉపన్యాసం ఇచ్చేవాడిని. ఒకమాటు ప్రారంభోపన్యాసం ఇవ్వటానికి ఒక  పెద్దాయనను   పిలిచాము. మామూలు గానే     ఒక గంట ఆలస్యం గా మొదలు పెట్టాం.   నేను మాములుగానే రిపోర్ట్ మొదలు పెట్టాను. కొంచెం సేపయిం తరువాత ఆయన అసహనం గా కదిలాడు సీట్లో. ఒక అర గంట చూసి లేచి వచ్చి నా చెవిలో రహస్యం గా చెప్పేడు. నేను వెళ్లిపోవాలి మీరు ముగిస్తే నాల్గు ముక్కలు చెప్పి వెళ్లిపోతాను అని.  అల్లాగే అల్లాగే అంటూ నేను మాములుగానే ఇంకో ముప్పావు గంట తీసుకున్నాను. ఆయన పాపం ఎప్పుడు వెళ్ళి పోయాడో కూడా చూడ లేనంత గా నా ఉపన్యాసం లో లీనమై పోయాను. ఆయన లేడు కాబట్టి ప్రారంభోపన్యాసం కూడా నేనే ఇచ్చేశాను.   ఈ విషయం మా బాసు గారికి తెలిసి నువ్వు మళ్ళీ మైకు పట్టుకుంటే ఉద్యోగం లోంచి డిస్మిస్ చేస్తానన్నాడు. అయినా నేను   లెఖ్ఖచేయలేదు.  

పాపం మా బాసుగారు తగు జాగ్రత్తలు తీసుకునేవారు. తప్పనప్పుడు మాత్రమే నాకు మైకు పట్టుకునే అవకాశం ఇచ్చేవారు. ఇచ్చిన రెండు నిముషాలకి మైకుకు అందకుండా ప్రద్యుమ్నా ముగించెయ్యి అనేవారు. ఇంకో రెండు నిముషాల తరువాత మైకులోనే చెప్పేవారు ముగించెయ్యి అని.ఇంకో రెండు నిముషాల తరువాత ఇంకా చాలామంది మాట్లాడాలి ఆపెయ్యి అని,  ఇంకో రెండు నిముషాల తరువాత నా తరువాత మాట్లాడేవాడిని పిలిచేవారు. వాడికి నాకు మైకు యుద్ధం జరిగేది. వాడికి అందకుండా నేను, నా చేతిలో మైకు లాక్కోనడానికి వాడు స్టేజి అంతా కలయ తిరిగేవారం.  మా భంగిమలు కూచిపూడి నృత్యనాటకం లాగా ఉంటాయి  అనేవారు ప్రేక్షకులు. ఆ తరువాత తప్పనప్పుడు నన్ను వోట్ ఆఫ్ థాంక్స్ కి పరిమితం చేసేవారు. అయినా నేను తగ్గేవాడిని కాను. హాలులో కూర్చున్న వాళ్ళంతా భోజనాలు చేసి వెళ్ళిపోయేదాకా చెపుతూనే ఉండేవాడిని. 

ఆ తరువాత నేనూ నిశితంగా ఆలోచించాను. నెలకో మాటో రెండు మాట్లో జేరే వందమందిని ఒకమాటు హింసించే బదులు రోజూ ఒక పదిమందిని హింసిస్తే మన కీర్తిపతాకలు ఇంకా ఎక్కువగా వ్యాపిస్తాయి గదా అని నిర్ణయించుకున్నాను. అప్పటినుంచి మైకాసురత్వాన్ని తగ్గించుకుని బాకాసురత్వాన్ని పెంచుకున్నాను.  బాకా ఊదడానికి  ఇద్దరు ముగ్గురున్నా చాలు. నలుగురైదుగురు ఒకేచోట దొరికితే భేషుగ్గా ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉంటే మనకి పండగే. రోజుకి కనీసం రెండు మూడు అవకాశాలు తేలికగా దొరకపుచ్చుకోవచ్చు. 

మనం బాకా ఊదడానికి  మనం గొప్పవాళ్ళం కానీ వారి అనుచరులం కానీ  కానఖ్ఖర్లేదు. మనలో ఏ ప్రత్యేకత లేకున్నా గుండె నిండా ధైర్యం ఉంటే చాలు. ధైర్యం ఎందుకంటే అబద్ధాలు చెప్పటానికి ధైర్యం కావాలి. మనం చెప్పేది ఎదుటి వాళ్ళు నమ్మరు అని తెలిసినా చెప్పటానికి  శౌర్యం కావాలి. విన్న వాళ్ళు చాటున ఎగతాళి చేస్తున్నారని అర్ధం అయినా మన గొప్పలు  చెప్పుకోడానికి   సాహసం కావాలి.  మనం చెప్పేది ఎదుటి వాళ్లెవరు నమ్మటం లేదు అని అర్ధం అయినా మనం చిన్నబుచ్చుకోకూడదు. అయినా  మన పంధాలో కొనసాగాలి.    ధైర్యం, శౌర్యం, సాహసం కలవాళ్ళే  బాకాసురులుగా ప్రసిద్ధి చెందుతారు.  
నేను బాకా ఊదడం అప్పటికే మొదలు పెట్టినా అది కుటీర పరిశ్రమ లెవెల్లోనే ఉండేది. 

 “ డెబ్భై  ఏళ్ల క్రితం మేము మా స్వంత ఊరిలో ఉన్నప్పుడు మా ఇంట్లో రోజూ కనీసం పదిమంది భోజనం చేసేవారు. ఊరికి వచ్చినవాళ్ళు మా ఇంట్లోనే భోజనం చేసేవారు,  మా ఇల్లు లంకంత ఉండేది, ఇంటిముందు ఎకరం పూలతోట ఉండేది, ఎవరింట్లో పెళ్లైనా కూరగాయలు మా పొలంలోంచే వెళ్ళేవి, మా ముత్తాత గారి మాట మీదే మా ఊరు నడిచేది, ఇత్యాదులు విరివిగానే జనం చెవిలో ఉదేవాడిని.”

క్రమక్రమంగా ధైర్య, సాహసాలు పెరగడంతో ముత్తాత దగ్గరి నుంచి తాత, వారి దగ్గర నుంచి నా పిల్లల  దాకా కూడా గొప్పలు చెప్పుకోవడం మొదలు పెట్టేను. చెప్పిందే పది మాట్లు చెపితే జనం నమ్ముతారు అని గోబుల్స్ గారు కూడా నిరూపించారు. వారి  అడుగుజాడల్లో అనేకమంది నడిచారు. మనం మన గొప్పలు చెప్పుకోవడంలో   తప్పులేదు అని  నమ్మాను. అతిశయోక్తులు కల్పించి, అది ఆచరణలో   విజయవంతంగా పెట్టాను. కుటీర పరిశ్రమను హెవీ ఇండస్ట్రీ గా అభివృద్ధి చేసుకున్నాను. 

మనం ఏదైనా చెపితే సాధారణంగా ముఫై నలభై శాతం నమ్మేస్తారు. అందుకనే వాళ్ళని మాబ్ అంటారు. వారు ఎక్కువుగా ఆలోచించరు. పదిహేను శాతం తటస్థంగా ఉంటారు. ఇరవైశాతం  మంది పట్టించుకోరు. ఒక ఇరవై శాతం మంది నిరూపించుము అంటూ ప్రశ్నిస్తారు. మిగతా వారు ఏదీ  నమ్మరు. ఎంత విశ్వాసం కలిగించినా, ఎన్ని రుజువులు , ఉదాహరణలు చూపించినా,  నమ్మరు. వారి నైజం అది.  మీరు నమ్మరా? ఒక ఉదాహరణ చెబుతా వినండి. నేను హై స్కూల్లో చదువుతున్నప్పుడు మా మిత్రుడు ఒకడు పైథాగరస్ సూత్రాన్ని నమ్మేవాడు కాదు. మాష్టారు ఎన్ని మాట్లు సూత్రం చెప్పి,  అడిగినా అన్ని మాట్లు వేరు వేరు జవాబులు చెప్పేవాడు. ఒక రోజున మా మేష్టారు వాడిని బల్ల మీద నుంచోపెట్టి “వీడు పైథాగరస్ సిద్ధాంతాన్ని నమ్మడు” అని ప్రకటించారు కూడాను.  నేను కూడా లెఖ్ఖల్లోనూ, వ్యాకరణంలోనూ  కొన్ని సూత్రాలు నమ్మేవాడిని కాదు. నా నమ్మకాలు వేరుగా ఉండేవి. అప్పుడప్పుడు మా మాష్టారు నేను నమ్మక తప్పని పరిస్థితులు కలిపించేవారు. నా శరీరం మీద నాకు  ప్రేమ ఎక్కువగా ఉండడం వల్ల నమ్మక తప్పేది కాదు. 

మనం, పైన చెప్పిన  మొదటి మూడు రకాల వాళ్లనే టార్గెట్ చేసుకోవాలి. మిగతా రెండు రకాలవారు తటస్థ పడినా లెఖ్ఖ చెయ్యకూడదు. గొప్పలు చెప్పుకోవడానికి నిర్ధారిత నియమాలు ఏమి లేవు. ఎవరికి వీలైన పద్ధతులు వారు ప్రయత్నించవచ్చు. కొంతమంది వారి తాతలు నేతులు తాగిన విధానాలు ప్రయోగిస్తే, మరి కొంతమంది వారి తండ్రుల గొప్పతనాన్ని తమకు అన్వయించుకోవచ్చు, ఇంకొంతమంది తమకు ఇచ్చం వచ్చినట్టు తమ గొప్పతనం చెప్పుకోవచ్చు. భార్యా పిల్లల తెలివితేటలు, గుణగణాలు విచ్చలవిడిగా ప్రదర్శించవచ్చు. మీరు శ్రద్ధగా గమనిస్తే మీ చుట్టుపక్కల ఇలాంటివారు  తరచుగా కనిపిస్తూనే ఉంటారు. నేను చెప్పుకున్న గొప్పలు కొన్ని చెప్పి ముగించేస్తాను. 

౧. మా నాన్న గారు గొప్ప వేద పండితులు, జ్యోతిష వేత్త కూడాను.   నా చిన్నప్పుడు, ఎక్కడో ,  గుర్తులేదు కానీ,   రాష్ట్రపతి మా నాన్నగారి పాండిత్యానికి ముగ్ధులైపోయి, పండిత సభలో వెయ్యి నూట పదహార్లు ఇచ్చి,   శాలువా కప్పారు. ఆ శాలువా మొన్నటిదాకా మా ఇంట్లోనే ఉండేది. మీరు చూసే ఉంటారు,  ఎర్రగా ఉండేది. పాతబడి చిరిగిపోవడం వల్ల కిందటి మాటు వెళ్ళినప్పుడు మా ఊర్లో దానికి అంత్యక్రియలు కూడా జరిపించాము. 

౨. రాజకీయ నాయకులు, కవులు, సాహితీ వేత్తలు చాలామంది మా ఇంటికి వచ్చేవారు. ప్రకాశం గారిని నేను మామయ్యా అని పిలిచేవాడిని.  శ్రీనివాసరావు గారు,   మా నాన్నగారి ఆశీర్వచనం తీసుకునే,  తన కావ్యం వ్రాయడం  మొదలు పెట్టారు. మా ఊరి మున్సిపల్ చైర్మన్ మా నాన్నగారు చెపితే తప్ప కాలు కదిపేవారు కాదు.

౩. మొన్న ఢిల్లీ మీటింగ్ కి వెళ్ళినప్పుడు మా మంత్రిగారు నా  గురించి తెలుసుకొని, ఫలానా వారి అబ్బాయా మీరు?  అని నాచేతులు పట్టుకొని,  కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు మా నాన్నగారిని తలుచుకొని.

ఈ విధంగా అనేక మార్లు నేను, మా నాన్నగారి గురించి,  నా గురించి, నా భార్య ,  పిల్లల గురించి  నానా  గొప్పలు చెప్పుకున్నాను. గొప్పలు చెప్పుకుంటూనే ఉంటాను. కిట్టని వాళ్ళు కోతలు కోస్తున్నాడు అంటారు. మీరు వాళ్ళని నమ్మకండి. 

నిత్య జీవిత హాస్యం


మొన్న ప్రముఖ దినపత్రిక (5/7/2015) ఈ నాడు ఆదివారం అనుబంధంలో నా పుస్తకం మీద ఒక సమీక్ష వచ్చింది. పుస్తక సమీక్ష పేజీలో నాల్గవ ఐటం గా.  నిత్య జీవిత హాస్యం అనే శీర్షికతో,   వ్రాసింది క్లుప్తంగా నైనా (తొమ్మిది లైన్లలోనే) బాగానే ఉందనిపించింది. అది అక్కడ  చదవని వారు   

http://archives.eenadu.net/07-05-2015/magzines/Sundayspecialinner.aspx?qry=pustaka 

చదవచ్చు.

అప్పుడప్పుడు మన మీద మనకే నమ్మకం సడలుతుంటుంది. ఇలాంటివి చూసినప్పుడు కొంత ఉత్సాహం తిరిగి వస్తుంది.........దహా

ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాను?


కాఫీ ఇచ్చి వెళ్లబోయింది మా ఆవిడ . 

“అవును దేవీ,  నేను నిన్ను ఎప్పుడు ప్రేమించడం మొదలు పెట్టానో చెప్పగలవా”  అని అడిగాను.

“అసలు మీరు నన్ను ప్రేమిస్తున్నారా?  అని కౌంటర్ వేసింది  మా ఆవిడ.  “పక్కింటి SWE లాగా మీరెప్పుడైనా  ఐ లవ్ యు రా చిన్నీ అని చెప్పారా? ఐ టూ రా కన్నా అని ఆవిడ లాగా నేనన్నానా ? ఏమిటో ఈ  మొగుడు అన్నీ ఇలాంటి సందేహాలే వస్తాయి”   అంటూ వెళ్లిపోయింది మా ఆవిడ  వంటింట్లోకి.

తీరుబడిగా కాఫీ  తాగుతూ ఆలోచించడం మొదలు పెట్టాను. How and when  ప్రేమించడం జరిగింది ? పెళ్ళికి ముందు మా ఇద్దరికీ పరిచయం లేదు. కనీసం బీరకాయ పీచు సంబంధమైనా లేదు రెండు కుటుంబాల మధ్య.  పెళ్లి చూపులలో కూడా  మేమిద్దరం  ఏమి మాట్లాడుకోలేదు.  పెళ్లి చూపులయిన  తరువాత బయట నుంచుని మాట్లాడుతున్నప్పుడు  వాళ్ళ తాత గారికి,  “నేను సిగరెట్లు   కాలుస్తానండి” అని చెప్పాను మా ఆవిడ వింటుండగా. అంతకు మించి అభిప్రాయాలూ, భావాలు, అభిరుచులు  పంచుకోవడం జరగలేదు.  సరే ఇరు వైపుల
పెద్దవారు ఆహా అంటే ఓహో అనుకున్నారు. చూపులు అయిన 15 రోజులలో పెళ్లి అయిపోయింది.
కారణాంతరాల వల్ల పెళ్లి అయిన తరువాత ఆర్నెల్లకి  కార్యం అన్నారు . ఆ 1st. రాత్రి కూడా  వాళ్ళ ఇంట్లో  మధ్య గదిలో (సీలింగ్ ఫాన్ ఉన్నది ఆ గదిలోనే) కానిచ్చేశాము. ఇవతలి గదిలో కబుర్లు చెప్పుకొనే వారు తెల్లవార్లు చెప్పుకుంటూనే ఉన్నారు. అవతల వైపు వరండా వేపు కిటికీ ఉంది గాని వరండాలో ట్రాఫ్ఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల తెరవడం కుదరలేదు.  కనీసం గుస గుస లాడుకోవడానికైనా వీలు లేక ఇద్దరిమధ్యా చర్చా కార్యక్రమం జరగలేదు. 
   
భార్యా సమేతంగా  జోర్హట్  ప్రయాణ మయ్యాను. విజయవాడ రైల్వే స్టేషనులో అయిన వాళ్లందరిని వదిలి, కళ్ళమ్మట నీళ్ళు కారుతుంటే,  ఏ మాత్రం పరిచయం లేని, భర్త అనే ఒకే ఒక నమ్మకంతో నా  చేయి పట్టుకొని 3000 kms.  ప్రయాణించడానికి సాహసించిన మా ఆవిడ  మీద మొదట సారిగా జాలి కలిగింది  నాకు. రైలు కదిలిన తరువాత సుమారు ఒక అరగంట దాకా ఏడుస్తూనే ఉన్న ఆవిడను  చూస్తూ కూర్చుండి పోయాను   ఎలా ఓదార్చాలో తెలియక.  దగ్గరకు తీసుకొని ఓదార్చేటంతటి చనువు లేకపోవడమే కారణం గావచ్చు.    

కొంచెం ఉద్వేగం తగ్గిన తరువాత చెప్పాను కొంచెం గంభీరంగా, ఇంకొంచెం డ్రమటిక్ గా “ఇప్పటినుంచి  మన జీవితం మొదలవుతుంది. నాలో నీకు నచ్చనివి చాలా ఉండవచ్చు అలాగే నాకు నచ్చనవి నీలో ఉండవచ్చు. కానీ ఒకరి కొకరుగా కలసి నడుద్దాం”  అని . 

విన్న వెంటనే చిరునవ్వు నవ్వింది మా ఆవిడ . ఓ రెండు నిముషాల తరువాత కొంచెం ఘట్టిగానే  నవ్వింది. “మీరు సినిమాలు ఎక్కువగా చూస్తారనుకుంటాను. అచ్చు సినిమాలో లాగానే చెప్పారు.” అని అంది. 

ఒక నిముషం సీరియస్ గానే మొహం పెట్టిన నేను  వెంటనే నవ్వేసాను. ఇద్దరు ఒకళ్ల నొకళ్లు చూసుకొని ఘట్టిగానే నవ్వుకున్నాము. ఐస్ బ్రేకింగ్ అన్నది  బహుశా ఆ క్షణంలో జరిగిందనుకుంటాను. అనాలోచితం గా, అనుకోకుండా ఓదార్చటానికి ఏమి చెప్పాలో తెలియక,  వదిలిన ఒక డయిలాగు చిత్రంగా ఇద్దరి మధ్య కొంచెం సన్నిహిత్వం  కలిగించింది. 

ఇంకో అరగంట తరువాత రాజమండ్రి స్టేషన్ లో ఒక భార్యా, భర్త,  ఒక చిన్న కుర్రాడు మా  కుపే లో ఎక్కడం, వాళ్ళు కలకత్తా,  ఆ తరువాత  గౌహతి దాకా మా తోటే ప్రయాణం చేయడంతో మళ్ళీ ఏడ్చే అవకాశం మా ఆవిడకి  గానీ ఓదార్చే అవకాశం నాకు గానీ  కుదరలేదు.   అల్లాగే చర్చా కార్యక్రమం కూడా వాయిదా పడింది. కానీ జోర్హాటు  చేరేటప్పటికి అంటే సుమారు రెండున్నర రోజుల తరువాత  ఇద్దరూ సరదాగానే  మాట్లాడుకోవడం  మొదలుపెట్టేసాము. 

కాపురం మొదలు పెట్టేటప్పడికి కొంచెం సాన్నిహిత్యం పెరిగినా చనువు పెరగలేదు.  జోర్హట్ లో నా హాస్టల్ రూంలో గృహా ప్రవేశం చేసింది. తమ వాళ్లు ఎవరూ తోడు రాకుండా కొత్త కాపురం మొదలు పెట్టేసాము. వాళ్లూ వీళ్లూ భోజనాలకి,  టిఫినీ లకి పిలవడం వల్ల ఒక వారం రోజులు ఇంట్లో  వంట చేయాల్సిన అవసరం రాలేదు. ఈ లోపున సంసారానికి కావల్సిన వన్నీ  సమకూర్చుకున్నాము. అప్పటికి జోర్హట్లో కుకింగ్ గాస్ దొరికేది కాదు. కిరోసిన్ స్టవ్ మీదే వంట.  వచ్చిన కొత్తలో మా ఆవిడకి  భాష సమస్య అయింది.  ఆమెకి తెలుగు తప్ప మరో భాష రాదు. ఉన్న అరడజను తెలుగు కుటుంబాలతో కాక మిగతా స్నేహితులతో మాట్లాడాలంటే నేను  దుబాసీ పాత్ర పోషించాల్సి వచ్చేది. 

అయిన వాళ్ళందరికీ దూరంగా, కష్ట సుఖాలు చెప్పుకోడానికి ఎవరూ లేకపోవడం మొదట్లో ఆవిడకి  కొంచెం ఇబ్బంది కలిగించినా క్రమక్రమం గా ఆ జీవితానికి అలవాటు పడిపోయింది. బహుశా రెండేళ్లు గడిచిన తరువాత కానీ పరస్పర నమ్మకం కుదరలేదేమో ననుకుంటాను. కష్టసుఖాలు నిర్భయంగా చర్చించుకోవడం అప్పుడే మొదలయింది. మీ ఇంట్లో అలాగా మా ఇంట్లో ఇలాగా అనేది పోయి మన ఇంట్లో ఇలాగే అనే విధానం వచ్చేసింది. మధ్యమధ్యలో అనేక చికాకులు వచ్చినా, కష్టాలు ఎదురైనా ఆ నమ్మకం ఇప్పటిదాకా బలపడుతూనే ఉంది. 
   
ఒక నెలరోజుల్లో మా ఆవిడ  నా  రొటీన్ కి అలవాటు పడిపోయింది.  ఉదయమే 8-8.15 మధ్య నేను  ఆఫీసు కెళ్లిపోయేవాడిని.  1-2 మధ్య ఒక అరగంట భోజనానికి వచ్చేవాడిని. మళ్ళీ సాధారణంగా  5.30-6 కి ఇంటికి తిరిగి వచ్చేవాడిని  ఆఫీసు నుంచి. వారానికి 3-4 రోజులు సాయంకాలం 7 గంటలకి క్లబ్బు కెళ్ళి రాత్రి  10.30-11 కి తిరిగి వచ్చేవాడిని.  పెళ్ళికి ముందు నుంచి కూడా  నేను  బ్రిడ్జ్ ఆటకి అడిక్ట్ అయ్యాను.  జోర్హట్  డిస్ట్రిక్ట్   టోర్నమెంట్స్ లో  ఇన్స్టిట్యూట్ తరఫున  ఆడేవాడిని.  మిగతా రోజులలో స్నేహితుల ఇళ్ళకి వెళ్లడమో, వాళ్ళు రావడమో జరిగేది. తెలుగు వాళ్ళు కలసి నప్పుడు అప్పుడప్పుడు అడ్డాట, లిటరేచరు ఆడేవాళ్ళం,   ముఖ్యంగా శలవు రోజుల్లో. మలయాళీ, తమిళ గ్రూపులు కలిస్తే 56, 28 ఆడేవాళ్ళం.  తదితర గ్రూపులైతే కాలక్షేపం కబుర్లు ఎక్కువగా ఉండేవి.  ఒక ఆరునెలల్లో  మా ఆవిడ  కూడా ఈ ఆటలన్నీ నేర్చేసుకుంది.   వచ్చిన రెండు మూడు నెలల్లో కొద్దిగా చల్తా హై హింది కూడా  నేర్చుకోవడంతో  మా ఆవిడ కాలక్షేపానికి లోటు  లేకపోయింది. 
 
ఆ తరువాత కూడా జీవితం మాములుగానే, సాఫీగానే సాగిపోయింది.  పెళ్ళైన కొత్తలో బాధ్యతలు ఉన్నా, ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువగా చికాకు పెట్టలేదు. దీనికి ముఖ్యకారణం మా ఆవిడ  అని నిస్సిగ్గుగా ఒప్పుకుంటాను.  అనవసరపు కోరికలే కాదు, బహుశా అవసరాలు కూడా అదుపులో పెట్టుకొని సంసారం సాగించింది.  ఏడాదిలోపులే ఒక అబ్బాయి పుట్టేసాడు.  ఆ తరువాత బాధ్యతలు  తీరాయనుకున్నప్పుడు, ఆరున్నరేళ్ళ తరువాత ఒక అమ్మాయి. పిల్లలు పెరగడం, వాళ్ళ చదువులు,  పెళ్ళిళ్ళవడం,  మనమలు, మనవరాళ్ళు  అంతా మాములుగానే అందరిళ్ళలో జరిగినట్టుగానే జరిగిపోయింది. మా ఆవిడకు  ఒక కంప్లయింట్ ఉంది.  పిల్లల చదువులో నేను శ్రద్ధ పెట్టలేదని, దగ్గర కూర్చుని చదివించలేదని. పిల్లాడు ఏడెనిమిది క్లాసులకి వచ్చేటప్పటికి, ఉద్యోగబాధ్యతలు పెరగడం,  వాడు పదోక్లాసుకి వచ్చేటప్పటికి ఒక ప్రాజెక్ట్ పనిమీద ఇంకోచోట సుమారు రెండేళ్లు ఉండాల్సిరావడం, ఆ టైములో నెలకి వారం, పదిరోజులకన్నా ఎక్కువుగా జోర్హాటులో లేకపోవడం కారణాలుగా చెపుతాను నేను.  ఉద్యోగ బాధ్యతలు పెరగడంతో  బ్రిడ్జ్ ఆటకి కూడా విడాకులు ఇచ్చేశాను. క్లబ్ కి వెళ్లడం కూడా మానేశాను.  కెరియర్ మీద పెట్టిన దృష్టి పిల్లల మీద పెట్టలేదన్నది  మా ఆవిడ  కంప్లైంట్.  పిల్లలు పోస్టు గ్రాడ్యుయేషను చేసారు కాబట్టి ఆ విషయంలో చింత కూడా లేదు మా ఇద్దరికీ.

ఏ ఒడిదుడుకులు లేకుండానే జీవితం ఇప్పటి దాకా సజావుగానే సాగిపోయింది. ఇప్పుడు రిటైరయి కూర్చున్న  తరువాత, ఒక శుభముహుర్తాన్న  వచ్చింది సందేహం నాకు, ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు పుట్టిందా ? అని. కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాను.  ఈ సందేహ నివృత్తిలో మా ఆవిడ  సహకారం లభించలేదు. పైగా వెధవ సందేహాలూ మీరూనూ  అంటూ తీసి పాడేసింది.

సుదీర్ఘ సహజీవనంలో అనేక గుర్తు పెట్టుకునే క్షణాలు దొర్లిపోయాయి. కొన్ని సంతోషకరమైనవి, కొన్ని ఉద్విగ్న భరితమైనవి, కొన్ని కోప కారణమైనవి,  కొన్ని విచారకరమైనవి, కొన్ని హాస్యాస్పదమైనవి, కొన్ని అనుకున్నవే అయినా  మరికొన్ని అనుకోకుండా జరిగినవి ఉన్నాయి కానీ ఏ ఒక్క క్షణం కారణంగా  ప్రేమ పుట్టింది అని చెప్పడం కష్టం అనిపించింది నాకు.  స్వతహాగా నాకు కోపం కొంచెం ఎక్కువ. మా ఆవిడకి కోపం వచ్చినా ప్రదర్శించేది కాదు ఇదివరలో. ఇప్పుడు నాకు తగ్గింది,  ఆవిడకి పెరిగిందేమో నని నా అనుమానం.  కానీ ఎప్పుడు ఎలా పుట్టాయో తెలియని పరస్పర ప్రేమ, గౌరవం,  అభిమానం, చనువు   బలపడుతూనే వచ్చాయి.  ఇన్ని ఏళ్ల జీవితం లో ఎప్పుడూ మాటల ద్వారా ప్రేమ వ్యక్తం చేసుకోలేదు  మేమిద్దరం  కూడా.

జీవితం ఇప్పటిదాకా సంతృప్తిగానే గడిచిపోయింది.  పెళ్ళైన ఆరేడేళ్ళ దాకా కొన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఆ తరువాత లేవు. ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యంగానూ, హాస్యాస్పదంగాను ఉంటుంది కానీ పెళ్ళైన రెండున్నర ఏళ్ళకి గానీ  తెగించి ఫిలిప్స్ ట్రాన్సిస్టర్ (కమాండర్) ఆరు వందలు పెట్టి కొనలేకపోయాను.  సంపాదించినది ఖర్చుపెట్టుకోవడమే తప్ప వెనకేసింది లేదు. ఇప్పుడు,   రెండేళ్లకో,  మూడేళ్ళకో అద్దె  ఇల్లు మారాల్సి వచ్చినప్పుడు ‘ఓ ఇల్లు కట్టుకుంటే బాగుండేదేమో’  నని అనిపిస్తోంది.  ఇది కూడా అసంతృప్తికి కారణం కాలేదు.

ఇంకో రెండేళ్లు ఇలాగే గడిపేసి, లేక  ఇంకా ముందరే,   చేసుకోలేము అని అనిపించినప్పుడో,   ఏదో ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాము. 


అవునూ, శంకర శాస్త్రి గారూ,  ఇదంతా ఇప్పుడు ఎందుకు చెపుతున్నారు? అంటే నిన్న  జూన్ 28కి పెళ్ళయి నలభై అయిదేళ్ళు గడిచాయి. అదన్నమాట సంగతి.......దహా.  

ఏక వాక్య టపా


నేను బాగా వ్రాశానని అనుకున్నా పాఠకులు నాతో ఏకీభవించక పోవడం వల్ల నా బ్లాగు చదవడానికి అతి కొద్దిమందే రావడం వల్ల చింతాక్రాంతుడనై ఏమి చెయ్యడానికి పాలుపోక ఇంకా బాగా వ్రాసే సత్తా లేకపోవడం వల్ల ఇంకేమి చెయ్యవలెనని సుదీర్ఘంగా నాలోచించగా కొంచెం వెరైటీగానూ  ప్రత్యేకంగానూ విలక్షణంగానూ కఠినంగానూ కొరుకుడు పడని విధంగానూ అర్ధంకాని పద్ధతిలోనూ ఏక వాక్య టపా వ్రాయాలని మదిలో మెరుపు మెరవగా నొక మిత్రుడిని ఏకవాక్య టపా ఎటుల వ్రాయాలని అడగగా వారున్నూ సుదీర్ఘ కాలం తమ సమయం వెచ్చించి పరిశోధించి ఆలోచించి మేధో మధనం చేసి ఒకే ఒక్క ఫుల్లు స్టాపు తో అదియున్నూ చివర  పెద్దగా పెట్టి మధ్యలో అనేకానేక నీ చిత్తం మెచ్చినన్ని నీ శక్తి సామర్ధ్యములను పదును బెట్టి నీ ఉహా శక్తికి మేధస్సు ను జోడించి  అది నీకు లేదని నాకు తెలిసినను మాట వరసకే చెప్పుచుంటినని కడు దీర్ఘముగా ఘట్టిగా నొక్కి వక్కాణిస్తూ  అనేకానేక  ,  ;  “ ”  ? !  ( )  ’  ఇత్యాదులను విరివిగా ఉపయోగిస్తూ నీకు వీలైనన్ని పేజీలు వ్రాయమని ఉపదేశించగా విన్న నా తోటి మిత్రుడొకడు కడుంగడు నాశ్చర్య చకితుడై నీవు  పాఠకులను దుఃఖిత మానసులను చేయ సంకిల్పింప కారణమేమియో  యని ప్రశ్నింపగా నేను పెదవులను ఈ చివరి నుంచి ఆ చివరకు సాగదీసి సుదీర్ఘ చిరునవ్వును వెలయించి తద్దినము ను జరుపుటకు యని జవాబివ్వగా వాడు మరల నాశ్చర్యముం బొందిన వాడై ఏ తద్దినము యని మరల ప్రశ్నింపగా ఈ మారు నేను వికటాట్టహాసం చేసి నిన్న 14వ తారీఖున  నా బ్లాగు నవ్వితే నవ్వండి మొదలు పెట్టిన  ఐదవ తద్దినం అని ఈ వేళ జ్ఞప్తికి వచ్చినదని   క్రూరంగా ఘోరంగా కర్కశంగా ఉద్ఘాటించగా యచట నున్న మిత్రులందరూ ముక్త కంఠముతో నవ్వితే నవ్వండి బ్లాగు పాఠకులందరికీ వారి సానుభూతి ప్రకటించగా వారి సానుభూతికి నాది కూడా జోడించి నా టపాలు చదివే సాహసం చేసిన చేస్తున్న కష్టపడి చదివి అవస్థ పడ్డ లేక అవస్థ పడుతూ చదివి కష్టపడ్డ  పాఠక దేవుళ్ళకు   ఈ ఏక వాక్య టపాలో మా సానుభూతి తెలియచేసుకుంటున్నాను

అదన్నమాట సంగతి. టపా పొడిగించుటకు కారణమేమనగా  , ; !  ఇత్యాదులు పెట్టుట మరచిపోయితిని. మీరు ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ మీకు నచ్చినవి పెట్టుకొనవలెనని ప్రార్ధించుచున్నాను.